Published On 15 May, 2026
నిజామాబాద్ అభివృద్ధికి మరో మైలురాయి: రెండు కీలక ROBలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

*“నిజామాబాద్ అభివృద్ధికి మరో మైలురాయి: రెండు కీలక ROBలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్”*

AD with Ashwani Vaishnav

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే గేట్ల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఇందల్వాయి–సిర్నాపల్లి (LC 198), జానకంపేట్–నిజామాబాద్ (LC 190A) రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లను “స్పెషల్ రైల్వే ప్రాజెక్టులు”గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ROBల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చింది.

ఈ మార్గాల్లో ప్రతిరోజూ రైళ్లు వెళ్లే సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం, విద్యార్థులు స్కూల్‌లకు ఆలస్యంగా చేరడం, రైతులు మార్కెట్‌కు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు నిరంతరం కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో 2025 జనవరి 7న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని మరోసారి కలిసి, జానకంపేట్, ఇందల్వాయి సహా కీలక ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల మంజూరుకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి నిరంతర కృషి ఫలితంగా 2026 ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం భూ సేకరణకు అనుమతి ఇవ్వగా, మే 4న అధికారిక గెజిట్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ అర్వింద్ ధర్మపురి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ అభివృద్ధికి శ్రీ నరేంద్ర మోది నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కనీసం 10 ROBల నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

మరోవైపు, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషితో ఇప్పటికే 7 ROBల నిర్మాణం పూర్తవగా, ఇప్పుడు మరో రెండు ROBలకు అనుమతులు రావడం అభివృద్ధికి కొత్త ఊపు తీసుకొచ్చిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకత్వం ఉంటే అభివృద్ధి ఆగదని… నిజామాబాద్‌లో కొనసాగుతున్న ఈ అభివృద్ధి పనులే స్పష్టంగా చూపిస్తున్నాయి.

Related Posts